హింసాకాండ జరిగిన బీర్భూమ్ ప్రాంతంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం పర్యటించారు. బాధిత కుటుంబీకులతో మాట్లాడారు. ఈ హింస వెనుక పెద్ద హస్తమే ఉందని మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజకీయ హింసను, చట్టవ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఆధునిక బెంగాల్లో ఇంత అనాగరికం జరుగుతుందని నేను అనుకోలేదు. తల్లులు, పిల్లలు చనిపోయారు. మీ కుటుంబీకులు చనిపోయారు. నా గుండె తరుక్కుపోతోంది అంటూ మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హింస వెనుక పెద్ద కుట్ర ఉందని, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని మమతా బెనర్జీ అక్కడికక్కడే పోలీసులను ఆదేశించారు. పోలీసులు అన్ని కోణాల్లో, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతారని బాధిత కుటుంబాలకు సీఎం మమత హామీ ఇచ్చారు. అలాగే ఫిర్యాదును స్వీకరించడంలో ఆలస్యం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మమత పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
సాకులు చెప్పొద్దు… చర్యలు తీసుకోండి : మమత
ఈ హింసకు కారకులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, వెంటనే శిక్షించాలని సీఎం మమతా బెనర్జీ పోలీసులను ఆదేశించారు. నిందితులు పారిపోయారు… దొరకడం లేదని కుంటి సాకులు చెప్పొద్దని పోలీసులకు సూచించారు. నిందితులు పారిపోయారు.. దొరకడం లేదని కుంటి సాకులు చెప్పొద్దు. బాధ్యులైన వారిని శిక్షించాలి. ఫిర్యాదు స్వీకరించడంలో అలసత్వం వహించిన పోలీసులపై కూడా చర్యలు తీసుకోండి. సాక్షులకు అవసరమైన భద్రత కూడా కల్పించండి. ఇళ్లు పూర్తిగా దగ్ధమైపోయిన వారికి, బాగు చేసుకునే నిమిత్తం రెండు లక్షల రూపాయలు ఇస్తాం. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తాం. అని మమత బెనర్జీ ప్రకటించారు.
సంబరాలు చేసుకుంటారా? సంతాపం వ్యక్తం చేస్తారా? బీజేపీ ఫైర్
బీర్భూమ్ ప్రాంతంలో సీఎం మమత పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం మమతకు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. సంబరాలు చేసుకుంటారా? సంతాపం వ్యక్తం చేస్తారా? అంటూ తృణమూల్ను సూటిగా ప్రశ్నించింది. బీర్భూమ్లో మహిళలను, పిల్లలను సజీవ దహనం చేశారని, చంపేశారని బీజేపీ మండిపడింది. దర్యాప్తు చేసే బదులు, స్వాగత తోరణాలు కట్టారని బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.