Mamata Banerjee : పశ్చిమబెంగాల్ (West Bengal) లో హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పై తాము చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జి (Mamata Banerjee) అన్నారు. కేంద్ర హోంమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని ఆమె అన్నారు. హోంమంత్రి వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేవిగా ఉన్నాయని విమర్శించారు. అలాంటి వ్యాఖ్యలతో బెంగాల్లో గెలువాలనుకుంటే ఎప్పటికీ గెలువలేరని స్పష్టంచేశారు. బెంగాల్ ప్రజలు అలాంటి వ్యాఖ్యలను ఏమాత్రం అంగీకరించరని చెప్పారు.
హుగ్లీలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో మమతాబెనర్జి ప్రసంగించారు. ఈ సందర్భంగా శుక్రవారం కేంద్రహోంమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. శుక్రవారం ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోంమంత్రి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బెంగాల్లోని టీఎంసీ గూండాలను తలకిందులుగా వేలాడదీస్తామని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను మమత తీవ్రంగా తప్పుపట్టారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా పశ్చిమబెంగాల్లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఏప్రిల్ 23న తొలి విడత ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. ఏప్రిల్ 29న రెండో విడత పోలింగ్ జరుగనుంది. మే 4న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. గతంలో దశాబ్దాల తరబడి బెంగాల్ను ఏలిన వామపక్షాలు ఇప్పుడు నామమాత్ర పార్టీలుగా మారిపోయాయి.