కోల్కతా : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి పర్యటనపై పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. ఎన్నికలు దగ్గరపడిన సమయంలో ప్రదాని వారణాసికి వెళ్లి గంగా నదిలో మునిగి ఆలయంలో కూర్చుంటారని ఆమె చురకలు వేశారు. కొవిడ్-19 సోకి ప్రజలు మరణించిన సమయంలో మృతదేహాలు గంగానదిలో పడేసిన నేపధ్యంలో ప్రధాని ఆ నదిలో ఎలా మునకేశారని దీదీ ప్రశ్నించారు.
బీజేపీ నేతలు ఎన్నికలప్పుడే గంగా నదిని గుర్తుంచుకుని ఆపై ఎన్నికలు ముగిశాక మర్చిపోతారని ఎద్దేవా చేశారు. తాను బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తినని, హిందూ పద్ధతులపై తనకు కాషాయ పార్టీ సర్టిఫికెట్ అవసరం లేదని దీదీ స్పష్టం చేశారు. తమ ప్రాంతంలో 40 ఏండ్లుగా కాళీ పూజ జరుగుతోందని, తాను జగధాత్రి సహా ఇతర పూజల్లో పాల్గొంటానని ఆమె చెప్పుకొచ్చారు.
దుర్గా పూజల సమయంలో ప్రతి మంటపానికి తాము రూ 50,000 ఇస్తామని బీజేపీ ఇలాంటి కార్యక్రమం చేస్తోందా అని ప్రశ్నించారు. ఈద్ వేడుకల్లోనూ తాను మైనారిటీలతో కలిసి పాల్గొంటానని, క్రిస్మస్ వేడుకల్లోనూ పాలుపంచుకుంటానని, గురుద్వారను కూడా సందర్శిస్తానని దీదీ చెప్పారు. తనకు అన్ని మతాలూ ఒకటేనని ఆమె స్పష్టం చేశారు.