కోల్కతా : బీజేపీ దోపిడీ దొంగల పార్టీ అని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. దేశంలో ప్రస్తుతం ప్రత్యామ్నాయ శక్తుల అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కేంద్రంలో బీజేపీ సర్కార్కు దీటైన ప్రత్యామ్నాయాన్ని ముందుకు తెచ్చే బాధ్యత విపక్షాలపై ఉందని దీదీ స్పష్టం చేశారు. బీజేపీ దగాకోరు..అవినీతి పార్టీ అని, కాషాయ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించేందుకు మనం పిలుపు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. మమతా బెనర్జీ మంగళవారం టీఎంసీ రాష్ట్ర కమిటీ సమావేశంలో మాట్లాడుతూ బీజేపీపై విరుచుకుపడ్డారు. బెంగాల్లో స్ధానిక ఎన్నికల్లో హింస చెలరేగిందని అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు గందరగోళం సృష్టించడాన్ని దీదీ తప్పుపట్టారు. కాషాయ పార్టీ ఎమ్మెల్యేలను తృణమూల్ సభ్యులు దీటుగా నిలువరించారని చెప్పారు.
బీజేపీ బెంగాల్ అసెంబ్లీలో వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని అన్నారు. ఎన్నికల్లో ఘోర వైఫల్యం చెందిన బీజేపీ పధకం ప్రకారమే రాజ్యాంగ సంక్షోభం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. ఈ సమావేశాల్లో పార్టీ నూతన రాష్ట్ర కమిటీని ఆమె ఏర్పాటు చేశారు. టీఎంసీ రాష్ట్ర కమిటీ విస్తృతస్ధాయి సమావేశంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా పాల్గొన్నారు.