కోల్కతా : బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయాలని కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్ధులపై కక్ష సాధింపు రాజకీయాలతో కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను ప్రయోగించి దాడులు చేయిస్తోందని దీదీ మండిపడ్డారు.
అమరవీరుల దినం పురస్కరించుకుని గురువారం కోల్కతాలో జరిగిన మెగా ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. కొవిడ్-19 లాక్డౌన్లతో గత రెండేండ్లుగా వర్చువల్గా జరిగిన ఈ కార్యక్రమం ఈసారి కోల్కతా వేదికగా టీఎంసీ శ్రేణులు మెగా ర్యాలీ నిర్వహించాయి. రాష్ట్ర వ్యాప్తంగా తరిలివచ్చిన పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో నగరం జనసంద్రాన్ని తలపించింది.
1993లో మమతా బెనర్జీ యూత్ కాంగ్రెస్ నేతగా ఉన్న సమయంలో యూత్ కాంగ్రెస్ ర్యాలీ సందర్భంగా జరిగిన పోలీసు కాల్పుల్లో 13 మంది మరణించారు. దీంతో జులై 21న అమరవీరుల దినంగా టీఎంసీ పాటిస్తోంది. ఏటా ఇదే రోజున భారీ ర్యాలీని నిర్వహిస్తూ టీఎంసీ అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకునే ఆనవాయితీని పాటిస్తోంది. మరుసటి ఏడాదిన పార్టీ రోడ్మ్యాప్ను ఇదే వేదికగా దీదీ ప్రకటిస్తుంటారు.