కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్ధులు భారీ మెజారిటీతో ఘన విజయం దిశగా దూసుకుపోతుండటంతో ఇది ప్రజా విజయమని బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు. బీజేపీని మట్టికరిపిస్తూ నాలుగు స్ధానాలనూ టీఎంసీ తన ఖాతాలో వేసుకోవడం ఖాయం కావడంతో తమ అభ్యర్ధులకు పట్టం కట్టిన ఓటర్లకు మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు.
విద్వేష రాజకీయాలు, ప్రచార హంగామాల కంటే అభివృద్ధి రాజకీయాలు, ఐక్యతకే బెంగాల్ మొగ్గుచూపుతుందని వెల్లడైందని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతో బెంగాల్ పురోభివృద్ధికి తాము పాటుపడతామని దీదీ స్పష్టం చేశారు. ఉప ఎన్నికలు జరిగిన ఖర్దా, శాంతిపూర్, గొసాబ, దిన్హాట స్ధానాల్లో టీఎంసీ ఘన విజయం దిశగా దూసుకెళుతుండగా ఇక్కడ ఆ పార్టీ విజయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.