Priyanka Gandhi | న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇండియా కూటమి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఇండియా కూటమి సమావేశమై.. బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలు, ఉమ్మడి ప్రచారం, పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వంటి అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఇదే సమావేశంలో ప్రియాంక గాంధీ పోటీ చేసే అంశంపై చర్చించినట్లు సమాచారం. వారణాసి నియోజకవర్గం నుంచి మోదీపై ప్రియాంకను పోటీకి నిలపాలని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
2019 ఎన్నికల్లోనే ప్రియాంకను వారణాసి నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించారు. కానీ ఆ ఎన్నికల్లో మోదీపై అజయ్ రాయ్ను కాంగ్రెస్ పార్టీ పోటీకి దింపింది. ఇప్పటి వరకు ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. మరి మమత ప్రతిపాదనకు ఇండియా కూటమి అంగీకరిస్తే.. ప్రియాంక తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగే అవకాశం ఉంటుంది.
ఇండియా కూటమి సమావేశం ముగిసిన అనంతరం ప్రియాంక పోటీపై మమతను మీడియా ప్రశ్నించగా, ఆమె సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. అయితే సీట్ల పంపకాన్ని డిసెంబర్ చివరి వారంలో లేదా, జనవరి రెండో వారంలో పూర్తి చేయాలని మెజార్టీ సభ్యులు నిర్ణయించినట్లు సమాచారం.