కోల్కతా : బీర్భం హింసాకాండలో బాధిత కుటుంబాలకు చెందిన పది మందికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం ఉద్యోగాలను కల్పించారు. బీర్భంలోని రాంపూర్హట్ గ్రామంలో సజీవ దహనమైన బాధితుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన సీఎం మాటనిలుపుకున్నారు. బీర్భం హింసాకాండ బాధిత కుటుంబ సభ్యులు పది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పారు.
రాంపూర్హట్లో స్ధానిక టీఎంసీ నేత మరణించిన అనంతరం చెలరేగిన హింసాకాండలో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. ఘటన అనంతరం గ్రామాన్ని సందర్శించిన సీఎం మమతా బెనర్జీ బాధత కుటుంబాలకు ఆర్ధిక సాయం ప్రకటించడంతో పాటు దగ్ధమైన గృహాల పునర్నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.
హింసాకాండలో కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలకు రూ 5 లక్షల చొప్పున చెక్కులు అందచేశారు. అగ్నికి ఆహుతైన ఇండ్ల పునర్నిర్మాణం కోసం రూ 2 లక్షల ఆర్ధిక సాయం అందించారు. పర్యటన సందర్భంగా దీదీ బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామనిఆమె హామీ ఇచ్చారు. ఈ కేసును సీబీఐకి కలకత్తా హైకోర్టు బదలాయించగా హత్య కేసుల్లో 22 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.