కోల్కతా, మే 31: కేంద్రప్రభుత్వం, పశ్చిమబెంగాల్ సర్కార్ మధ్య కోల్డ్ వార్ ముదురుతున్నది. బెంగాల్ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అలపన్ బందోపాధ్యాయను రిలీవ్ చేయాలంటూ కేంద్రం జారీచేసిన ఉత్తర్వుల నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ ఆదేశాల మేరకు సోమవారం మధ్యాహ్నం ప్రధాన కార్యదర్శి బందోపాధ్యాయ పదవీవిరమణ చేశారు. ఆ వెంటనే ఆయన్ని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడిగా నియమిస్తూ మమత నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 1న (మంగళవారం) ఆయన కొత్త విధుల్ని చేపట్టనున్నారు. మూడేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. బెంగాల్ ప్రధాన కార్యదర్శిగా హెచ్కే ద్వివేదిని మమత నియమించారు. ‘యాస్’ ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా బెంగాల్లో జరిగిన సమావేశానికి మమత, ప్రధాన కార్యదర్శి బందోపాధ్యాయ ఆలస్యంగా వచ్చి అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ వెంటనే బందోపాధ్యాయ ఢిల్లీలో రిపోర్ట్ చేయాలని కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే మమత బందోపాధ్యాయను సీఎస్గా పదవీవిరమణ చేయించి.. తన ప్రధాన సలహాదారుడిగా నియమించారు. అయితే, కేంద్రం ఆదేశాలను ధిక్కరించినందుకు బందోపాధ్యాయ చార్జ్షీట్, క్రమశిక్షణా చర్యలను ఎదుర్కొనవచ్చని కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఏకపక్షంగా ఉత్తర్వులేమిటి?
అంతకుముందు.. బందోపాధ్యాయను రిలీవ్ చేయడం కుదరదంటూ సీఎం మమత అన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి సోమవారం లేఖ రాశారు. కేంద్రప్రభుత్వ ఏకపక్ష ఉత్తర్వులతో తాను షాక్కు గురయ్యానని పేర్కొన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా జారీచేసిన ఆ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘ఒకవైపు కరోనా, మరోవైపు ‘యాస్’ తుఫాన్ సృష్టించిన బీభత్సంతో బెంగాల్ క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటున్నది. ఇలాంటి సమయంలో ప్రధాన కార్యదర్శిని రిలీవ్ చేయలేం. దీనిపై మేం చేసిన అభ్యర్థనను కేంద్రం కూడా అంగీకరించింది’ అని మమత గుర్తుచేశారు. అయితే, ప్రస్తుతం ఆయన్ని రిలీవ్ చేయాలంటూ ఇప్పుడు అడగటమేంటని ప్రశ్నించారు. “యాస్’ సమీక్షా సమావేశానికి నేను, ప్రధాన కార్యదర్శి ఆలస్యంగా రావడమే ఈ ఆదేశాలకు కారణమా?’ అని ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు.
నేడు హాజరవ్వండి.. లేకుంటే చర్యలు
ఢిల్లీలోని సిబ్బంది మంత్రిత్వ శాఖ కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాలని రిటైర్డ్ బెంగాల్ సీఎస్ బందోపాధ్యాయకు కేంద్రప్రభుత్వం సోమవారం రిమైండర్ నోటీసును జారీచేసింది. హాజరుకాని పక్షంలో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపింది. సోమవారం హాజరుకావాలంటూ తామిచ్చిన గత ఆదేశాలను పాటించకపోవడంతో రిమైండర్ను జారీచేసినట్టు పేర్కొన్నది.