కోల్కతా, జూన్ 5 : తృణమూల్ కాంగ్రెస్లో సంక్షోభం నాటకీయ మలుపులు తిరుగుతున్నది. మమతపై తిరుగుబావుటా ఎగురవేసిన తిరుగుబాటు వర్గంలోనే మరో తిరుగుబాటు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ నాయకురాలిగా మమత కొనసాగింపుపై తిరుగుబాటు వర్గంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రితబ్రత బెనర్జీ నేతృత్వంలో 58 మంది ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ వర్గంలోనూ అసమ్మతి రాజుకుంటున్నట్టు సమాచారం. అసెంబ్లీ తాజాగా జరిగిన భేటీకి కేవలం 32 మంది ఎమ్మెల్యేలే హాజరైనట్టు తెలిసింది. రితబ్రత ప్రతిపాదించినట్టు మమతను చీఫ్ అడ్వైజర్గా కాకుండా పార్టీ చైర్పర్సన్గా ప్రకటించాలని వీరిలో 16 మంది స్పష్టంచేసినట్టు సమాచారం. లేదంటే తాము రెబల్ వర్గంలో ఉండబోమని తేల్చిచెప్పినట్టు తెలిసింది. తమను రాజకీయంగా పెంచి పోషించింది మమతనే అని వారు స్పష్టంచేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రితబ్రత నాయకత్వంలోని వర్గంలో ఏర్పడిన అసమ్మతిని అవకాశంగా మలచుకుని ఆ వర్గంలోనే తిరుగుబాటు లేవనెత్తేందుకు మమత ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. టీఎంసీ టికెట్పై గెలిచిన 80 మంది ఎమ్మెల్యేలలో ముస్లింలు 31 మంది ఉన్నారు. తిరుగుబాటు వర్గంలో చేరినప్పటికీ అసంతృప్తితో ఉన్న వీరిలో కొందరితో సంప్రదింపులు జరుపుతున్న మమత వారిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.
పార్టీకి చెందిన 23 మంది ఎంపీలు తిరుగుబాటు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీఎంసీ ఎంపీలలో కూడా అసమ్మతి రాజుకుంటున్నదని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై పలువురు ఎంపీలు అసంతృప్తిగా ఉన్నట్లు వారు చెప్పారు. పార్లమెంట్లో విడిగా జట్టు కట్టే విషయాన్ని కూడా వారు చర్చించుకుంటున్నట్లు సమాచారం. చీలిక వర్గాన్ని ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను వారు పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. డజనుకు పైగా ఎంపీలు ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నట్లు వర్గాలు తెలిపాయి. టీఎంసీకి ప్రస్తుతం పార్లమెంట్లో 29 మంది ఎంపీలు ఉన్నారు. లోక్సభలో ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు పొందాలంటే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్ట నిబంధనల కింద మూడింట రెండు వంతుల సంఖ్యాబలం ఉంటే కనీసం 22 మంది ఎంపీలు ఉండాలి. రాజ్యసభలో పార్టీకి 13 మంది సభ్యులు ఉన్నారు. ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు పొందడానికి 9 మంది ఎంపీలు ఉండాల్సి ఉంటుంది.
లోక్సభలో పార్టీలో అసమ్మతి నెలకొన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మమతా బెనర్జీ లోక్సభలో అడుగుపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓటమి పాలైన నేపథ్యంలో తాను లోక్సభకు వెళ్లే విషయాన్ని ఆమె తీవ్రంగా పరిశీలిస్తున్నారు. దిగువ సభకు వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకునేందుకు టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ను తన బహరంపూర్ లోక్సభ నియోజకవర్గాన్ని ఖాళీ చేయమని ఆమె కోరవచ్చని తెలుస్తున్నది. గతంలో లోక్సభ సభ్యురాలిగా మమత ఉన్నారు. ప్రస్తుతం కోల్కతా దక్షిణగా పిలుచుకుంటున్న కలకత్తా సౌత్ నుంచి ఆరుసార్లు ఎంపీగా ఆమె ఎన్నికయ్యారు.