న్యూఢిల్లీ : ఒడిశా దుర్ఘటన (Odisha train accident) చరిత్రలోనే ఘోర రైలు ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాద ఘటనపై పలువురు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తుండగా ఈ దుర్ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్టగా విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖపై మరోసారి విరుచుకుపడ్డారు. ఈ దుర్ఘటనలో ఓవైపు మృతుల సంఖ్య పెరుగుతుంటే కేంద్రం జాబితాలో మృతుల సంఖ్య తగ్గుతున్నదని మండిపడ్డారు.
తమ జాబితాలో మృతుల సంఖ్య పెరుగుతుంటే కేంద్రం జాబితాలో మరణాల సంఖ్య తగ్గడం విడ్డూరంగా ఉందని దీదీ మోదీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం ఒడిశా దుర్ఘటన విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును ఆక్షేపించారు. 270 మందికి పైగా ప్రాణాలు విడిచినా ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం కొరవడిందని ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాధాకర ఘటనకు బాధ్యత తీసుకోవడం నుంచి మోదీ ప్రభుత్వం పారిపోలేదని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు రైల్వే మంత్రిని బాధ్యుడిని చేస్తూ ప్రధాని మోదీ తక్షణమే మంత్రి రాజీనామాను కోరాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
కాగా, ఒడిశాలో రైళ్ల ప్రమాదానికి సంబంధించిన కారణాలపై ఇప్పటికే రైల్వే సేఫ్టీ కమిషనర్ దర్యాప్తు చేసి నివేదిక పూర్తి చేశారని.. రిపోర్టు తమకు అందాల్సి ఉందని రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. నివేదిక అందిన తర్వాతే ప్రమాదంపై పూర్తి స్పష్టత వస్తుందని అన్నారు. అయితే నివేదిక రావడానికి ముందే బాధ్యులను గుర్తించామని తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ను మార్చడం ద్వారానే ప్రమాదం జరిగిందని చెప్పారు. బాధ్యులను కూడా గుర్తించామని తెలిపారు. కవచ్కు, ప్రమాదానికి సంబంధం లేదని తెలిపారు. ప్రస్తుతం తమ ఫోకస్ మొత్తం పునరుద్ధరణ పనులపైనే ఉన్నట్లుగా కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
Read More