న్యూఢిల్లీ: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంపై (Odisha Train Accident) సుప్రీంకోర్టులో (Supreme Court) ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. మూడు రైళ్ల ప్రమాద ఘటనపై రిటైర్డ్ జడ్జి (Retired judge) నేతృత్వంలోని నిపుణుల బృందంతో (Judicial review) విచారణ జరిపించాలని కోరుతూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో సుప్రీంకోర్టు లాయర్ విశాల్ పిటిషన్ వేశారు. అదేవిధంగా ప్రజల భద్రత కల్పించడానికి రైళ్లలో కవచ్ (KAVACH) ప్రొటెక్షన్ సిస్టమ్ తక్షణమే అమలుచేసేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు.
ఈ నెల 2న సాయంత్రం 7 గంటల సమయంలో ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదం 288 మంది మరణించారు. మరో 1100 మంది గాయపడ్డారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలపై ఇప్పటికే రైల్వే సేఫ్టీ కమిషనర్ దర్యాప్తు చేసి నివేదిక పూర్తి చేశారని.. రిపోర్టు తమకు అందాల్సి ఉందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదివారం ఉదయం మీడియాకు వెల్లడించారు. అయితే నివేదిక రావడానికి ముందే బాధ్యులను గుర్తించామని తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ను మార్చడం ద్వారానే ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం తమ ఫోకస్ మొత్తం పునరుద్ధరణ పనులపైనే ఉందని వెల్లడించారు.
రైళ్లు, సిగ్నలింగ్ వ్యవస్థ, రైల్వే పట్టాల్లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ పరికరాలను అమరుస్తారు. ఎప్పుడైనా ఒకే ట్రాక్లో రెండు రైళ్లు ప్రయాణిస్తున్నట్టయితే దగ్గరకు చేరుకునే లోపే లోకోపైలట్ ప్రమేయం లేకుండానే బ్రేకులు పడి రైళ్లు ఆగిపోతాయి. లోకోపైలట్ సిగ్నల్ జంప్ చేసినా ‘కవచ్’ వ్యవస్థ దానికదే బ్రేకులు పడేలా చేస్తుంది.
కాగా, ట్రైన్ కొలైజన్ అవాయిడెన్స్ సిస్టమ్ పేరుతో రైళ్లలో ప్రమాదాలను అరికట్టేందు ఉద్దేశించిన టెక్నాలజీని 2012లోనే అభివృద్ధి చేయడం ప్రారంభమైంది. 2019లో బీజేపీ ప్రభుత్వం దీనికి ‘కవచ్’గా పేరు పెట్టింది. ఇప్పటికి 1,455 కిలోమీటర్ల మార్గంలో, 134 రైల్వే స్టేషన్ల పరిధిలో, 77 రైళ్లలో మాత్రమే ‘కవచ్’ను ఏర్పాటు చేశారు. అంటే మొత్తం రైల్వే లైనులో ఈ వ్యవస్థ అందుబాటులో ఉన్నది కేవలం 2 శాతం లైన్లలో మాత్రమే. ఒక కిలోమీటరు మార్గంలో ‘కవచ్’ వ్యవస్థ ఏర్పాటుకు దాదాపుగా రూ.54 లక్షలు ఖర్చవుతున్నదని అంచనా. గత బడ్జెట్లో కేంద్రం ‘కవచ్’కు కేవలం రూ.2,000 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ నిధులు 3,703 కిలోమీటర్లకు మాత్రమే సరిపోతాయి. ఈ లెక్కన దేశంలోని మొత్తం రైలు మార్గంలో ‘కవచ్’ వ్యవస్థను అందుబాటులోకి తేవడానికి మరో 20 ఏైండ్లెనా పట్టవచ్చు.