కోల్కతా : పశ్చిమ బెంగాల్ వెలుపల తృణమూల్ కాంగ్రెస్ విస్తరణ ప్రణాళికలపై ఇతర పార్టీల వ్యాఖ్యలను ఆ పార్టీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తోసిపుచ్చారు. బీజేపీ రాజకీయంగా దేశం నుంచి కనుమరుగు కావాలని తాను కోరుకుంటున్నానని, కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో పోటీ చేస్తుండగా తాము గోవాలో ఎందుకు పోటీ చేయకూడదని దీదీ ప్రశ్నించారు. ముంబైలోని పౌర సమాజ సభ్యులతో మమతా ముచ్చటిస్తూ కాషాయ పార్టీకి వ్యతిరేకంగా బరిలో నిలబడి పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్రాంతీయ పార్టీలన్నీ ఒకే లక్ష్యంతో ఏకతాటిపైకి వస్తే బీజేపీని ఓడించడం సులభమేనని స్పష్టం చేశారు. కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే మోదీ సర్కార్ సాగు చట్టాల రద్దు, ఇంధన ధరల తగ్గింపు నిర్ణయాలు తీసుకుందని విమర్శించారు. ఇక పలు విపక్ష పార్టీలతో సంప్రదింపులు జరిపేందుకు మమతా బెనర్జీ మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. శివసేన నేతలు ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్లతో మంగళవారం మంతనాలు జరిపిన దీదీ బుధవారం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో భేటీ కానున్నారు.