Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ సర్కార్ ఈ ఏడాది దుర్గాదేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో మండపాల నిర్వాహకులకు సీఎం మమతా బెనర్జీ వరాలు కురిపించారు. ప్రభుత్వోద్యోగులకూ వరుసగా 11 రోజులు దసరా సెలవులు ప్రకటించారు. ఉత్సవాల ఏర్పాట్లపై దుర్గాపూజ మండపాల నిర్వాహకులతో ఆమె సమావేశమయ్యారు. వచ్చేనెల 30 నుంచి అక్టోబర్ 10 వరకు ప్రభుత్వ సెలవులు ప్రకటించారు. దీంతో ప్రభుత్వోద్యోగులకు 11 రోజులు సెలవులు వస్తాయి. ఇప్పటివరకు ప్రతియేటా వచ్చే దుర్గాదేవి మండపాలకు ప్రభుత్వం ఇచ్చే నిధులు రూ.50 వేల నుంచి రూ.60 వేలకు పెంచుతున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. మండపాలకు వినియోగించే విద్యుత్ బిల్లుల్లో 50 శాతం డిస్కౌంట్ 60 శాతానికి పెంచుతున్నట్లు చెప్పారు. రిజిస్టర్డ్ దుర్గాదేవి మండపాలు 40 వేలకు పైగా ఉంటాయి.
దుర్గాదేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పశ్చిమ బెంగాల్ సర్కార్ ప్రతియేటా సెలవులు ఇస్తుంది. అక్టోబర్లో నవరాత్రి ఉత్సవాల సెలవులతోపాటు ఇతర సెలవులు కలిసి 16 రోజులు సెలవులు వచ్చాయి. గతేడాది నవరాత్రి, ఇతర సెలవులతో కలిపి వివిధ శాఖల్లో పని చేసే రాష్ట్ర ఉద్యోగులకు 16 రోజుల సెలవులు వచ్చాయి. ఈ ఏడాది అది 22 రోజులకు చేరనున్నది. కాళీ పూజ, దీపావళి పండుగతోపాటు 11 రోజుల దుర్గాదేవి ఉత్సవాలు, సాధారణ సెలవులతో కలిపి మొత్తం 22 రోజులు ప్రభుత్వోద్యోగులకు సెలవులు వస్తాయి.
సర్కార్ ఆధ్వర్యంలో పశ్చిమబెంగాల్లో అంగరంగ వైభవంగా జరిగే దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు రెండేండ్లుగా సాదాసీదాగా జరిగాయి. కానీ, ఈ ఏడాది దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలకు పూర్వ వైభవం తేవాలని మమతా బెనర్జీ సర్కార్ భావిస్తున్నది. దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలకు యునెస్కో వారసత్వ ట్యాగ్ ఇవ్వడంతో మమతా బెనర్జీ ఈ ఏడాది అట్టహాసంగా వాటిని నిర్వహించనున్నది.