కోల్కతా : మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల విద్వేష వ్యాఖ్యలకు నిరసనగా నిరసనలు మిన్నంటుతున్నాయి. హౌరాలో శనివారం పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు తలెత్తడంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. బీజేపీ చేసిన తప్పులకు ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడాలని ఆమె నిలదీశారు. హౌరా ఘర్షణలకు దోషులపై కఠిన చర్యలు చేపడతామని, ఈ హింస వెనుక కొన్ని రాజకీయ పార్టీల ప్రమేయం ఉందని దీదీ పేర్కొన్నారు.
హింసాత్మక నిరసనలతో గత రెండు రోజులుగా హౌరాలో సాధారణ జనజీవనానికి విఘాతం కలిగిందని కొన్ని రాజకీయ పార్టీలు వెనకుండి అల్లర్లను ప్రేరేపిస్తున్నాయని మండిపడ్డారు. అల్లర్లను అణిచివేస్తామని, హింసకు పాల్పడిన దోషులపై కఠిన చర్యలు చేపడతామని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఇక ఉలుబెరియ సబ్డివిజన్లో విధించిన 144 సెక్షన్ను జూన్ 15 వరకూ పొడిగించారు.
శుక్రవారం చెలరేగిన హింసాకాండకు సంబంధించి హౌరా పోలీసులు ఇప్పటివరకూ 70 మందిని అరెస్ట్ చేశారు. అల్లర్లను అదుపులోకి తీసుకువచ్చి హింసను అణిచివేసేందుకు కేంద్ర బలగాలను పంపాలని బీజేపీ ఎంపీ, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు సౌమిత్ర ఖాన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. ఇక విద్వేష వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మను అరెస్ట్ చేయాలని శుక్రవారం ప్రార్దనల అనంతరం కోల్కతాలో వేలాది మంది నిరసన ప్రదర్శనలు చేపట్టారు.