Gujarat | గుజరాత్లోని మచ్చు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విచారం వ్యక్తం చేశారు. ఘటనపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లేదా హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.
‘‘మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఘటనపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లేదా హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి. ఐదు రోజుల క్రితమే సందర్శనకోసం ఈ బ్రిడ్జిని తెరిచారు.. అంతలోనే అంతమందిని అక్కడికి ఎవరు అనుమతించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలి. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. గెహ్లోత్ కూడా అక్కడే ఉన్నారు. వీలైనంత సాయం చేసేందుకు ప్రయత్నిస్తాం. ఈ ఘటనపై ఎలాంటి రాజకీయం చేయదల్చుకోలేదు. ఎవరినీ నిందిచము. విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. అప్పుడే దీనిపై స్పందిస్తాం’’ అని మల్లికార్జున ఖర్గే తెలిపారు.
గుజరాత్లోని మోర్బీ ప్రాంతంలోని మచ్చు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కుప్ప కూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 141 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 177 మందిని రక్షించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) కింద రూ.2 లక్షలు, గాయ పడిన వారికి రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల సాయం ప్రకటించింది.
ఇటీవలే మరమ్మతులు ఈ బ్రిడ్జికి పూర్తి చేసి, గుజరాత్ నూతన సంవత్సరాది సందర్భంగా ఈ నెల 26న పునఃప్రారంభించారు.1879 ఫిబ్రవరి 20న నాటి బాంబే గవర్నర్ రిచర్డ్ టెంపుల్.. ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. దర్బార్గఢ్-నాజర్బాగ్ మధ్య నిర్మించిన ఈ బ్రిడ్జికి దాదాపు 140 ఏండ్ల చరిత్ర ఉంది. దీని పొడవు 765 అడుగులు ఉంటుంది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని ఇంగ్లండ్ నుంచి తెప్పించి మరీ పూర్తి చేశారు.