Congress : పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న సవరించిన డీలిమిటేషన్ బిల్లు (Delimitation Bill) పై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు (Congress President) మల్లికార్జున ఖర్గే (Mallikarjun Karge) ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ని కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రధానికి లేఖ రాశారు. బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు పార్టీలకు వాటిని పూర్తిగా పరిశీలించే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్లో కూడా డీలిమిటేషన్ ప్రతిపాదనలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి పలుమార్లు లేఖలు రాసినా స్పందన రాలేదని ఖర్గే గుర్తుచేశారు. తమ అభ్యర్థనలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. ఏప్రిల్ 17న లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు-2026 కు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించకపోవడంతో అది ఆమోదం పొందలేదని గుర్తుచేశారు. ఇప్పుడు అదే బిల్లును సవరించి వర్షాకాల సమావేశాల్లో మళ్లీ తీసుకురానున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో సవరించిన డీలిమిటేషన్ ప్రతిపాదనలు, అనుబంధ అంశాలపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చించాలని ఖర్గే లేఖలో కోరారు. బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు వాటిని అధ్యయనం చేసేందుకు తగిన సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. డీలిమిటేషన్ బిల్లు-2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2026 కూడా ఏప్రిల్లో లోక్సభలో ఆమోదం పొందలేదు. ఈ ప్రతిపాదనల ప్రకారం లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళల రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం చేయడంతో పాటు, లోక్సభ స్థానాల సంఖ్యను 850కు పెంచనున్నారు.