బెంగళూరు: రాహుల్గాంధీయే తమ పార్టీకి కాబోయే అధ్యక్షుడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. రాహుల్గాంధీ పార్టీ అధ్యక్షత బాధ్యతలు స్వీకరించేందుకు సుముఖంగా లేరని, అయినా తాము ఒత్తిడి చేసైనా ఆయనను తమ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటామని చెప్పారు.
రాహుల్గాంధీ దేశమంతటికీ తెలిసిన మనిషి అని, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, పశ్చిమబెంగాల్ నుంచి గుజరాత్ వరకు ఆయనకు మద్దతు ఉందని ఖర్గే ఓ మీడియా సంస్థతో అన్నారు. రాహుల్గాంధీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటానంటే పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంటుందని, ప్రస్తుతం ఆయన తప్ప పార్టీని నడిపించగల నాయకుడు ఇంకెవరూ లేరని వ్యాఖ్యానించారు.
పార్టీ క్షేమం కోసం, దేశ క్షేమం కోసం, ఆర్ఎస్ఎస్-బీజేపీలతో పోరాడటం కోసం, దేశ సమైక్యత కోసం కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని తాము రాహుల్గాంధీని కోరుతామని ఖర్గే చెప్పారు. త్వరలో చేపట్టనున్న భారత్ జోడో యాత్రకు రాహుల్గాంధీ నేతృత్వం అవసరమన్నారు. కాగా, ఆదివారం సీడబ్ల్యూసీ సమావేశం జరుగనుంది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్కు ఈ సమావేశంలో ఆమోదం తెలుపనున్నారు.