న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మల్లికార్జున్ ఖర్గే తన పోటీదారు, సీనియర్ నేత శశి థరూర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అధికార వికేంద్రీకరణ అజెండా దిశగా వెళతానన్న శశి థరూర్ వ్యాఖ్యలను ప్రస్తావించగా ఆయనతో తనను పోల్చవద్దని కోరారు.
తాను బ్లాక్ అధ్యక్షుడి నుంచి ఈ స్ధాయికి ఎదిగానని, ఆ సమయంలో శశి థరూర్ ఉన్నారా అని ప్రశ్నించారు. శశి థరూర్ తన మ్యానిఫెస్టోతో ముందుకెళ్లవచ్చని, తాను మాత్రం ఉదయపూర్ డిక్లరేషన్లో తీసుకున్న నిర్ణయాల అమలు అజెండాగా పనిచేస్తానని ఖర్గే స్పష్టం చేశారు. ప్రజల దృష్టిని ఆకర్షించడం, ఎన్నికల మేనేజ్మెంట్, జాతీయ స్ధాయిలో పార్టీ శ్రేణులకు శిక్షణ వంటి మూడు నిర్ణయాలను అమలు చేసే దిశగా కసరత్తు సాగిస్తానని అన్నారు.
సీనియర్ నేతలు, నిపుణులతో సంప్రదింపులు చేపట్టడం ద్వారా నిర్ణయాల అమలు దిశగా చర్యలు చేపడతానని చెప్పారు. పార్టీని ప్రస్తుత సంక్లిష్ట పరిస్ధితులు, సవాళ్ల నుంచి బయటకు తెచ్చేందుకు యువ నాయకత్వం అవసరమా అని ప్రశ్నించగా పార్టీలో ఎవరేంటనేది తనకు అన్నీ తెలుసని, అవసరమైన సమయంలో యువ నేతల సేవలు ఉపయోగించుకుంటామని అన్నారు.