న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఇవాళ మల్లిఖార్జున్ ఖర్గే, శశి థరూర్లు నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఇద్దరి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని తెలుస్తోంది. జార్ఖండ్ నేత కేఎన్ త్రిపాఠి కూడా అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేశారు. డెడ్లైన్ లోపే ఇవాళ అందరూ తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ వేసిన తర్వాత శశి థరూర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పట్ల తనకు ఒక విజన్ ఉందని, దాన్ని ప్రతినిధులకు తెలియజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. పార్టీ కార్యకర్తల మద్దతు తీసుకుంటానని, అందరి అభిప్రాయాలకు తాను స్వరంగా మారనున్నట్లు చెప్పారు. నిర్ణయాలను తీసుకునే విధానాన్ని కాంగ్రెస్ సెంట్రలైజ్ చేసిందని, ఆ వ్యవస్థను బ్రేక్ చేయాలని, కొందరు ఓ వ్యక్తిని ఏకగ్రీవం చేశారని, కానీ దానికి తాను వ్యతిరేకిని అని థరూర్ అన్నారు.
మల్లిఖార్జున్ ఖర్గే కూడా ప్రెసిడెంట్ పోస్టుకు నామినేషన్ వేశారు. ఆయన పత్రంపై 30 మంది నేతలు సంతకాలు చేశారు. ఏకే ఆంటోనీ, అశోక్ గెహ్లాట్, అంబికా సోనీ, ముకుల్ వాస్నిక్, ఆనంద్ శర్మ, అజయ్ మాకెన్లు ఖర్గేకు మద్దతు పలికారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సమయంలో తనకు తోడుగా అనేక మంది నేతలు, ప్రతినిధులు వచ్చారని, వాళ్లందరికీ థ్యాంక్స్ చెబుతున్నట్లు ఖర్గే తెలిపారు. అక్టోబర్ 17న ఫలితాలు వస్తాయని, గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చిన్నతనం నుంచే కాంగ్రెస్ ఐడియాలజీకి కనెక్ట్ అయి ఉన్నానని, స్కూల్కు వెళ్తున్న రోజుల్లో గాంధీ, నెహ్రూ ఐడియాలజీ తరపున ప్రచారం చేసేవాడినని ఖర్గే అన్నారు.