న్యూఢిల్లీ, ఆగస్టు 25: కులగణన వివాదంపై విపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కులగణన కోసం ప్రస్తుతం ఉన్న ప్రశ్నావళిని రద్దు చేసి ప్రజలతో సంప్రదింపులు జరిపిన తర్వాత కొత్త ప్రశ్నావళిని రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ, బీహార్లో నిర్వహించిన సర్వేల తరహాలో చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
ఖర్గే, రాహుల్ గాంధీ ఉమ్మడి లేఖ గురించి కాంగ్రెస్ ప్రధాన కార్చదర్శి జైరామ్ రమేశ్ విలేకరులకు వివరించారు. కచ్చితమైన సమాచారం లేకుండా దేశంలో సామాజిక న్యాయ విధానాలను సమర్థవంతంగా అమలు చేయలేము. కులగణనను సరిగ్గా నిర్వహిస్తేనే వివిధ కులాల సంఖ్యబలం, సామాజిక ఆర్థిక స్థితిపై కచ్చితమైన అంచనా సాధ్యమవుతుంది అని ఆ లేఖలో కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.