న్యూఢిల్లీ : మహారాష్ట్ర పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే కాషాయ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘడి (ఎంవీఏ) సర్కార్ను అస్ధిర పరిచేందుకు బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎంవీఏ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తూ సుస్ధిరంగా కొనసాగుతుంటే ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు బీజేపీ ప్రతి అవకాశాన్నీ వాడుకుంటోందని దుయ్యబట్టారు. మహారాష్ట్రలో తమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ఎంవీఏ సర్కార్ను కూలదోస్తోందని మండిపడ్డారు.
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి కాషాయ పార్టీ బాధ్యత వహించాలని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కూడా బీజేపీ మహరాష్ట్రలో చిచ్చురేపిందని ఖర్గే ఆరోపించారు. తామంతా (కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన) ఎంవీఏ సర్కార్ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. మరోవైపు మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తీవ్రతరమవడంతో కాంగ్రెస్ పార్టీ అత్యవసర భేటీ జరిపింది. ముంబైలోని సహ్యాద్రి గెస్ట్హౌస్లో గురువారం సాయంత్రం పార్టీ కీలక నేతలు సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో సీనియర్ నేతలు హెచ్కే పాటిల్, బాలాసాహెబ్ థొరట్, నానా పటోల్, అశోక్ చవాన్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. రెబెల్ ఎమ్మెల్యేలు ముంబైకి చేరుకుని సీఎంతో చర్చలు జరిపితే ఎంవీఏ సర్కార్ నుంచి శివసేన బయటకు వస్తుందని సేన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ అత్యవసర భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. శివసేన ఎమ్మెల్యేల్లో తిరుగుబాటు ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని కాంగ్రెస్ చెబుతోంది. ఎంవీఏ సర్కార్ను కూలదోసేందుకు కాషాయ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది.