బెంగళూరు: కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి (CM) ఎవరనే అంశంపై కొనసాగుతన్న ఉత్కంఠకు ఇప్పట్లో తెరపడేలా లేదు. అవినీతి బీజేపీ (BJP) ప్రభుత్వానికి గట్టిబుద్ధిచెప్పిన కన్నడ ఓటర్లు కాంగ్రెస్ (Congress) పార్టీకి తిరుగులేని ఆధిక్యం కట్టబెట్టారు. అయితే పార్టీ విజయానికి కృషిచేసిన సిద్ధరామయ్య (Siddaramaiah), డీకే శివకుమార్(DK Shivakumar).. ఇద్దరూ బలమైన నేతలే కావడంతో సీఎం ఎంపికలో పీఠముడి ఏర్పడింది. ఇద్దరిలో ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తే మరొకరు తిరుగుబాటు చేస్తారా అనే సంశయం పార్టీలో నెలకొన్నది. దీంతో పార్టీ అధిష్ఠానం సీఎం ఎంపికలో మల్లగుళ్లాలు పడుతున్నది.
కాగా, తనను ముఖ్యమంత్రి నైనా చేయండి లేదా ఎమ్మెల్యేగా (MLA) ఉండనీయండని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పార్టీ అధినేత మల్లికర్జున ఖర్గేతో (Mallikarjun Kharge) అన్నట్లు తెలుస్తున్నది. సీఎం పదవిని ఆశిస్తున్న సిద్ధరామయ్య, డీకేతో ఖర్గే విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్యకు ఇప్పటికే ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు. ఈసారి తనవంతు. తనను ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ అధ్యక్షుడితో అన్నట్లు సమాచారం. ఆయనకు సీఎంగా మరోసారి అవకాశం కల్పిస్తే తనను ఎమ్మెల్యేగా ఉండనీయాలని కోరినట్లు తెలిసింది. అదేవిధంగా సిద్ధూపై రాష్ట్రంలోని ప్రధానవర్గమైన లింగాయత్లు వ్యతిరేకంగా ఉన్నారని డీకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నూతన సీఎం ఈ నెల 18న ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి విషయమై పార్టీ అధిష్ఠానం బుధవారం సాయంత్రంలోగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఈ నెల 13న వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 66 సీట్లకే పరిమితమైంది. ఇక కింగ్మేకర్గా అవతరిస్తుందనుకున్న జేడీఎస్ 19 స్థానాలతోనే సరిపెట్టుకున్నది.