న్యూఢిల్లీ : వ్యభిచారాన్ని నేరంగా పరిగణించాలని భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) బిల్లును పరిశీలించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం మంగళవారం కేంద్రానికి సిఫారసు చేసింది. వివాహ వ్యవస్థ చాలా పవిత్రమైనదని, దానిని తప్పనిసరిగా పరిరక్షించాలని తెలిపింది. వ్యభిచారాన్ని నేరంగా పరిగణించడంలో స్త్రీ, పురుష భేదాలేవీ ఉండకూడదని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో తెలిపింది. ఈ నేరానికి పాల్పడే స్త్రీ, పురుషులకు సమాన బాధ్యత ఉండేలా చూడాలని తెలిపింది.
ఈ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆగస్టులో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వ్యభిచారం నేరం కాదని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం 2018లో తీర్పు చెప్పింది. ఈ తీర్పును తోసిపుచ్చుతూ, వ్యభిచారాన్ని నేరంగా పరిగణించడాన్ని పునరుద్ధరించాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. ఐపీసీ, సీఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లకు బదులుగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టారు. వీటిని పరిశీలించి, తగిన సిఫారసులు చేయడం కోసం హోం శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపించారు.