ముంబై : నేవీ ముంబై పరిధి అంబేద్కర్ నగర్లోని ఓ ఇంకు పరిశ్రమలో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అంబేద్కర్ నగరలోని బాలాజీ ప్లైకోట్ పరిశ్రమలో ప్రింటింగ్ ఇంకులు, లోహాలకు కోటింగ్, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ సామగ్రి తయారు చేస్తారు.
ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో పరిశ్రమలో ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
12 మంది అగ్నిమాపక సిబ్బంది 10 నుంచి 12 ట్యాంకర్లతో ఘటనాస్థలానికి చేరుకొని 8 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
మంటలు ఆర్పుతుండగా అగ్నిమాపక సిబ్బంది కాలిపోయిన వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పరిశ్రమలో పనిచేసే కార్మికుడై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణం కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది మూడోస్థాయి అత్యయిక అగ్నిప్రమాదమని అగ్నిమాపక అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.