న్యూఢిల్లీ : డబ్బు తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారనే ఆరోపణలపై లోక్సభ నుంచి తనను బహిష్కరించడం పట్ల తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువ మొయిత్ర (Mahua Moitra) ప్రభుత్వంపై మండిపడ్డారు. నిబంధనలకు పాతరేసి ఎధిక్స్ కమిటీ తనను బహిష్కరించాలని సిఫార్సు చేసిందని ఆమె ఆరోపించారు. ఎథిక్స్ కమిటీ నిబంధనలన్నింటినీ గాలికొదిలేసింది..రేపు నన్ను వేధించేందుకు నా ఇంటికి సీబీఐని పంపుతారని మహువ మొయిత్ర పార్లమెంట్ వెలుపల విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
సభలో నైతిక విలువలపై స్ఫూర్తిగా నిలవాల్సిన ఎథిక్స్ కమిటీని ఈ లోక్సభ ఆయుధంగా మలుచుకుని విపక్ష నేతలను బుల్డోజ్ చేస్తోందని దుయ్యబట్టారు. మరోవైపు మహువ మొయిత్రను లోక్సభ నుంచి బహిష్కరించడంపై పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. తమ పార్టీ సహచరి మహువ మొయిత్రపై వేటు వేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. బహిష్కృత ఎంపీకి పార్టీ బాసటగా నిలుస్తుందని భరోసా ఇచ్చిన దీదీ బీజేపీ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. తమ పార్టీ ఎంపీని బహిష్కరించాలని ఎథిక్స్ కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం మహువ మొయిత్రకు సభలో మాట్లాడే అవకాశం కల్పించకపోవడం దారుణమని అన్నారు. వివరణ ఇచ్చేందుకు ఎంపీకి అవకాశం ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన తీరును తాను ఖండిస్తున్నానని పేర్కొన్నారు.
పార్టీ ఆమెకు పూర్తిగా అండగా ఉంటుందని, ఆమెకు న్యాయం జరగాలని తాము కోరుకున్నా ప్రభుత్వం ఎలాంటి అవకాశం ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఇది బీజేపీ కక్షసాధింపు రాజకీయాలకు అద్దం పడుతోందని దీదీ పేర్కొన్నారు.ఇది పార్లమెంట్ చరిత్రలో విషాదకర రోజని దీదీ అన్నారు. మొయిత్రను బహిష్కరిస్తూ లోక్సభ నిర్ణయం రాజ్యాంగ హక్కులకు తూట్లు పొడవడమేనని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో తమకూ మూడింట రెండు వంతుల మెజారిటీ ఉందని, ఎవరినైనా తక్షణమే బహిష్కరించే అవకాశం ఉందని, కానీ తాము ఇలాగే చేయాలా అని ఆమె ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికలకు కేవలం రెండు, మూడు నెలల సమయం మాత్రమే ఉండగా ఇలాంటి ఘటన దురదృష్టకరమని, తాము అంగీకరించబోమని దీదీ స్పష్టం చేశారు.
Read More :