కోల్కతా : దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అమ్మవారిని పూజిస్తున్నారు. పెద్ద పెద్ద వేదికలను ఏర్పాటు చేసి కనకదుర్గ విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. అయితే, కోల్కతాలో ఏర్పాటు చేసిన ఓ పండల్.. కొత్త వివాదానికి తెరలేపింది. అయితే, దీనిపై నిరసన వ్యక్తం కావడంతో పోలీసుల సూచన మేరకు విగ్రహాన్ని నిర్వాహకులు మార్చేశారు.
నైరుతి కోల్కతాలోని రుబీ క్రాసింగ్ వద్ద అఖిల భారత హిందూ మహాసభ నవరాత్రి పండల్ను ఏర్పాటు చేసింది. ఈ వేదికపై కనకదుర్గమ్మ రాక్షసులను చంపుతున్నట్లుగా ఉన్నది. అయితే, మహిషాసురుడిగా గాంధీని ఉంచడం వివాదాస్పదంగా మారింది. దీనిపై పలు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. గాంధీని జయంతి జరుపుకున్న వేళ ఇలా అసురుడిగా చూపడం ఏంటంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం హోంశాఖ దృష్టికి వెళ్లింది. పోలీసుల ఆదేశాలతో ఆఘమేఘాల మీద గాంధీజీని అసురుడిగా చూపించిన కనకదుర్గమ్మ విగ్రహాన్ని అఖిల భారత హిందూ మహాసభ నిర్వాహకులు మార్చేశారు.
దీనిపై పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రచూడ్ గోస్వామి మాట్లాడుతూ.. తాము గాంధీని అసురుడిగానే భావిస్తామని, అందుకే అలా విగ్రహం ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. అయితే, విగ్రహాన్ని మార్చాలని హోంశాఖ నుంచి తమపై తీవ్ర ఒత్తిడి రావడంతో తప్పనిసని పరిస్థితుల్లో విగ్రహాన్ని మార్చినట్లు చెప్పారు. కాగా, వీరి చర్యను రాష్ట్రంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, సీపీఐ-ఎం, కాంగ్రెస్తో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి. ఇది ముమ్మాటికీ జాతిపితను అవమానించడమే అని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు. హిందూ సంస్థలు ఇలా గాంధీజీని అవమానించడంపై బీజేపీ ఇంకా ఏం మాట్లాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.