ముంబయి: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు సమీపంలోనే వెలుగు చూస్తున్నాయి. అయితే, మహారాష్ట్రలో మాత్రం గత వారంతో పోలిస్తే కేసులు సంఖ్య పెరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు కారణం ఒమిక్రాన్ సబ్వేరియంట్ XBB అని భావిస్తున్నారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ సబ్వేరియంట్ XBB వైద్య వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. BA.2.75, BQ 1 రకాలు కలిపి XBB సబ్ వేరియంట్గా ఏర్పడినట్లు వైద్య నిపుణులు వెల్లడించారు. ఈ వేరియంట్ను ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడులో గుర్తించినట్లు తెలిపారు. ఈ ఆగస్టులోనే సింగపూర్, యూఏఈలో XBB సబ్ వేరియంట్ వెలుగులోకి వచ్చింది. దీనికి BA.2.75 కంటే వేగంగా వ్యాప్తి చెందే లక్షణం, రోగనిరోధక శక్తిని ఏమార్చే గుణం ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
సబ్వేరియంట్ కారణంగా మహారాష్ట్రలో గత వారంతో పోలిస్తే కొత్త కేసులు 17.7 శాతం మేర పెరిగాయి. చలికాలం, పండగల సీజన్ ఉండటంతో ఈ వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఠాణె, రాయ్గఢ్, ముంబయిలో కేసులు పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రజలకు సూచించింది. జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నవారు జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.