ముంబై : ఈరోజుల్లో మొబైల్ ఫోన్లో తలదూర్చని పిల్లలను ఎక్కడా చూడలేం. గేమ్స్, కామిక్స్, కార్టూన్ షోలు అంటూ గంటల తరబడి చిన్నారులు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. మొబైల్ వాడకంతో ఎన్నో అనర్ధాలు వాటిల్లుతున్నా పిల్లలకు మొబైల్ ఇవ్వకుండా కట్టడి చేయడంలో పేరెంట్స్ ఫెయిల్ అవుతున్న పరిస్ధితి నెలకొంది.
ఇక మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలోని బన్సీ అనే గ్రామంలో పిల్లలు, 18 ఏండ్ల లోపు టీనేజర్లు మొబైల్ పోన్ చూడటాన్ని నిషేధించారు. నవంబర్ 11న జరిగిన గ్రామ సభలో గ్రామస్తులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుని, ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే రూ. 200 ఫైన్ విధించాలని తీర్మానించారు. కొవిడ్-19 నేపధ్యంలో పిల్లలు ఎక్కువసేపు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోవడంతో వాటికి బానిసలయ్యారని, గేమ్స్ చూడటం, అడల్ట్ కంటెంట్ను వీక్షించడం చేస్తున్నారని బన్సీ గ్రామ సర్పంచ్ గజానన్ తేల్ చెప్పారు.
ఈ నిర్ణయం అమలు చేయడం కష్టమేనని తమకు తెలుసని, తొలుత కౌన్సెలింగ్ ద్వారా ఈ సవాళ్లను అధిగమిస్తామని చెప్పుకొచ్చారు. మొబైల్ వాడుతూ కనిపించే పిల్లలకు జరిమానా విధిస్తామని అన్నారు. ఇక గ్రామస్తుల నిర్ణయాన్ని అధికారులు స్వాగతించారు. విద్యార్ధుల్లో మంచి అలవాట్లను పెంచేలా గ్రామస్తులు సరైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు.