Maharashtra | మహారాష్ట్రలో ప్రభుత్వంలో అజిత్ పవార్ చేరిన నుంచి రాజకీయాలు వేడెక్కాయి. ఎన్సీపీ, శివసేన (యూబీటీ) బీజేపీతో పాటు కేంద్రంపై విమర్శలు విరుచుకుపడ్డాయి. శివసేన ఉద్ధవ్ వర్గం మరోసారి బుధవారం బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక బీజేపీలో మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలను మాత్రమే చేర్చుకోవడం మిగిలిందంటూ విమర్శలు గుప్పించింది. బీజేపీ, మహారాష్ట్ర ప్రభుత్వం అవినీతి, దోపిడీకి పాల్పడుతున్నాయని శివసేన మౌత్ పీస్ సామ్నా విమర్శించింది. మహారాష్ట్రలో ఏక్ పురా ఔర్ దో ఆధా సినిమా జరుగుతోందని, సీఎం ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది.
అజిత్ పవార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, మరో ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న మనీలాండరింగ్ కేసులో అజిత్ పవార్తో సహా తొమ్మిది మంది ఎన్సీపీ నాయకుల్లో నలుగురు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అజిత్ పవార్తో పాటు ఛగన్ భుజ్బల్, హసన్ ముష్రిఫ్లతో సహా మరో ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఏకనాథ్ షిండే మంత్రివర్గంలో చేరారు. ఈ పరిణామాలన్నింటి వెనుక ఢిల్లీ ఉందని సామ్నా ఆరోపించింది.
అవినీతి, నైతికత, దోపిడీ భారతీయ జనతా పార్టీకి సమస్య కాదని, మహారాష్ట్రలో బీజేపీ ఏం చేసిందని మండిపడింది. నీరవ్ మోదీ, విజయ్ మాల్యాను ఇంకా చేర్చుకోలేదని, వారికి కూడా చేర్చుకొని.. ఒకరిని పార్టీ జాతీయ కోశాధికారిగా, మరొకరిని నీతి ఆయోగ్కు, మూడో వ్యక్తిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా నియమిస్తారంటూ బీజేపీ నేతృత్వంలోని కేంద్రంపై విమర్శలు గుప్పించింది. నీటిపారుదల శాఖ కుంభకోణంలో అజిత్ పవార్ జైలుకు వెళ్తారని ఫడ్నవీస్ అన్నారని, అయితే ఎన్సీపీ నేత ఆయన సమక్షంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారంటూ చురకలంటించింది.