హైదరాబాద్: మహారాష్ట్రలో ఆర్టీసీ ప్రయాణికుల జేబులకు చిల్లు పడనుంది. ఎందుకంటే ఇవాళ్టి నుంచి బస్ చార్జీలను పెంచాలని మహారాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎంఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. పెంపు ఈ అర్ధరాత్రి నుంచే అమల్లో వస్తుందని తెలిపింది. ప్రతి నెలా అదనంగా రూ.50 కోట్ల ఆదాయం రాబట్టుకోవడం కోసం ప్రస్తుత చార్జీలపై 17.17 శాతం చార్జీలను పెంచినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఎంఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ శేఖర్ చన్ని వెల్లడించారు.
ఇటీవల కరోనా మహమ్మారి విజృంభణ, లాక్డౌన్ల కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయని, దాంతో భారీగా నష్టాలు వచ్చాయని శేఖర్ చన్ని చెప్పారు. దీనికితోడు ఈ మధ్య వరుసగా పెట్రో ధరలు పెరుగడం కూడా ఎంఎస్ఆర్టీసీకి తలకు మించిన భారంగా మారిందన్నారు. అందుకే బస్ చార్జీలను పెంచడం మినహా మరో మార్గం కనిపించలేదని ఆయన పేర్కొన్నారు. కాగా, మహారాష్ట్ర ఆర్టీసీలో 95 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 16 వేల బస్సులు నడుస్తున్నాయి.