ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఆందోళన కలిగిస్తున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 27 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా రికార్డుస్థాయిలో 40,414 కరోనా కేసులు, 108 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,13,875కు, మరణాల సంఖ్య 54,181కు చేరింది. అలాగే ముంబైలో ఆదివారం రికార్డుస్థాయిలో 6,923 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం సంఖ్య 3,98,674కు పెరిగింది.
మరోవైపు మహారాష్ట్రలో గత 24 గంటల్లో 17,874 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 23,32,453కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,25,901 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.
మహారాష్ట్రలో కరోనా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆదివారం నుంచి రాత్రి పూట కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఇది అమలుకానున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, బహిరంగ ప్రదేశాలు నిర్మానుష్యంగా మారాయి.