ముంబై: మహారాష్ట్రలో కరోనాతోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 31,111 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 2,67,334కు చేరింది. మరోవైపు సోమవారం 24 మంది కరోనా వల్ల మరణించారు. 29,092 మంది రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
కాగా, ముంబైలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. సోమవారం కొత్తగా 5,956 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 50,757కు, మొత్తం కేసుల సంఖ్య 10,05,818కు చేరింది. గత 24 గంటల్లో 12 మంది కరోనా రోగులు చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 16,469కు చేరింది.
మరోవైపు, మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నది. సోమవారం కొత్తగా 122 కేసులు నిర్ధారణ అయ్యాయి. పూణేలో 40, మీరా భయందర్లో 29, నాగపూర్లో 26, ఔరంగాబాద్లో 14, అమరావతిలో 7, ముంబైలో 4, బాంద్రా, థాణే, పింప్రి చించ్వాడ్లో ఒక్కోటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,860కి చేరింది.