Maharashtra Crisis | శివసేనను చీలి.. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాది ప్రభుత్వాన్ని కూల్చిన ఏక్నాథ్ షిండే ప్రస్తుతం పార్టీపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. మరో వైపు ఉద్ధవ్ పార్టీని కాపాడుకునేందుకు ఉద్ధవ్ పోరాడుతున్నారు. ఈ విషయంపై శివసేనకు చెందిన ఇరువర్గాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం పిటిషన్ల విచారణను ఆగస్ట్ ఒకటో తేదీకి వాయిదా వేసింది.
శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై అఫిడవిట్ దాఖలు చేసేందుకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి సమయం ఇచ్చింది. ఠాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలని షిండే వర్గం తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే సీజేఐ ధర్మాసనాన్ని కోరారు.
ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ కేసులో నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇది రాజకీయంగా సునిశితమైన కేసు. మేం ఒకరి పక్షాన ఉన్నామనే అభిప్రాయాన్ని కల్పించాలని అనుకోవడం లేదు’ అని పేర్కొన్నారు. వాదనలు విన్న తర్వాత కొన్ని సమస్యలపై విస్తృత ధర్మాసనం పరిశీలన అవసరమనిపిస్తోందని, వచ్చే బుధవారంలోగా అన్ని పక్షాలు దీనిపై అభిప్రాయాలు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.
ఉద్ధవ్ వర్గం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. పదో షెడ్యూల్లో నిషేధం ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వాలను పడగొడితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. అయితే, అనర్హత వేధింపులతో పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని ఏక్నాథ్ షిండే తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదించారు.