ముంబయి : మరోసారి విశ్రాంతి తీసుకోకుండా ఉండాలంటే నాలుకను అదుపులో పెట్టుకోవాలంటూ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నేత సంజయ్ రౌత్ రౌత్ను మహారాష్ట్ర మంత్రి శంభురాజ్ దేశాయ్ హెచ్చరించారు. మనీలాండింగ్ కేసులో బెయిల్పై ముంబయి జైలు నుంచి రౌత్ నవంబర్ 9న విడుదలైన విషయం తెలిసిందే. సబర్బన్ గోరేగావ్లోని హౌసింగ్ ప్రాజెక్టుకు సంబంధించిన కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆగస్టు 1న ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, మహారాష్ట్ర – కర్ణాటకల మధ్య చెలరేగిన సరిహద్దు వివాదంపై ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వంపై సంజయ్ రౌత్ మండిపడ్డారు. గతకొద్ది రోజులుగా సరిహద్దు వివాదంపై షిండే ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నారు. కర్ణాటకలోని బెలగావిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
‘ఢిల్లీ మద్దతు’ లేకుండా బెలగావిలో హింసాత్మక సంఘటనలు జరుగవని ఆరోపించారు. దాడులను ఎదుర్కోవడంలో ప్రభుత్వం నిస్సహాయంగా కనిపిస్తోందని, మహారాష్ట్రను అస్థిరపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. మంత్రి దేశాయ్ మీడియా సమావేశంలో సంజయ్ రౌత్కు వార్నింగ్ ఇచ్చారు. ‘బయటి వాతావరణం మీకు సరిపోయినట్లు కనిపిస్తుంది. విశ్రాంతి కోసం తిరిగి వెళ్లకుండా ఉండాలంటే మీరు నాలుకను అదుపులో పెట్టుకోవాలి’ అని హెచ్చరించారు. బెలగావి జిల్లాలోని హిరేబౌగ్వాడి వద్ద టోల్ బూత్ సమీపంలో మహారాష్ట్ర వైపు నుంచి కర్ణాటకలోకి ప్రవేశించే వాహనాలపై రాళ్లు రువ్వడంతో రెండు రాష్ట్రాల మధ్య దశాబ్దాల నాటి వివాదం మంగళవారం రోడ్డుకెక్కింది. పూణె జిల్లాలో కర్ణాటకకు చెందిన కనీసం నాలుగు బస్సులను శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) వర్గం, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) కార్యకర్తలు ధ్వంసం చేశారు.