ముంబై: మహారాష్ట్రలో అధికార పక్షమే లక్ష్యంగా జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఉద్ధవ్ థాక్రే మంత్రివర్గంలోని ఓ మంత్రిని అరెస్టు చేసిన ఈడీ.. తాజాగా రవాణా శాఖ మంత్రి, శివసేన నేత అనిల్ పరబ్ (Anil Parab) ఆస్తులపై దాడులు చేసింది. గురువారం తెల్లవారుజామునే ముంబైలోని పరబ్ అధికార నివాసంతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, పుణెలోని మరికొన్ని చోట్ల, డపోలీలో ఉన్న రిసార్టులో ఏక కాలంలో సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల ప్రకారం ఆయనపై ఈడీ కేసు నమోదు చేసింది.
పరబ్కు డపోలీ సిటీలో ఓ రిసార్ట్ ఉంది. దానిని 2017లో రూ.కోటికి ఆయన కొనుగోలు చేశారు. మళ్లి 2019లో దానిని సదానంద్ కదమ్ అనే వ్యక్తికి రూ.1.10 కోట్లకు అమ్మేశారు. 2020లో అక్కడ నిర్మాణాలు చేశారు. అయితే 2017-2020 మధ్యకాలంలోనే రిసార్టు వ్యవహారంలో రూ.6 కోట్లు అక్రమాలు జరిగినట్లు ఆదాయ పన్ను శాఖ గుర్తించింది.