ముంబై : నైజీరియా నుంచి ఫుణెకు వచ్చిన ఓ ప్రయాణికుడు(52) గుండెపోటుతో మృతి చెందాడు. అనంతరం అతని శాంపిళ్లను సేకరించిన పుణెలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్కు పంపారు. శాంపిళ్లను పరీక్షించగా, సదరు వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే ఆ వ్యక్తి కొవిడ్ కారణాలతో చనిపోలేదని, కేవలం గుండెపోటు కారణంగానే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యక్తి గత 13 ఏండ్ల నుంచి షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు.
మహారాష్ట్రలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 450కి చేరింది. నిన్న ఒక్కరోజే 198 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 30 మంది ఇంటర్నేషనల్ ప్రయాణికులు ఉన్నారు. అయితే ముంబైలోనే 190 కేసులు నమోదు కాగా, థానేలో 4, సతారా, నాందేడ్, పుణె, పింపిరి చించ్వాడ్లో ఒక్కో కేసు చొప్పున నమోదు అయ్యాయి. ఇక గత కొద్ది రోజుల నుంచి మహారాష్ట్రలో కొవిడ్ కేసులు తీవ్రంగా అధికమవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,368 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.