States border row | మహారాష్ట్ర-కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు ప్రాంత వివాదం ఉద్రిక్తంగా మారింది. బెలగావిలో మంగళవారం మహారాష్ట్రకు చెందిన పలు వాహనాలను ముఖ్యంగా లారీలను నిలిపివేశారు. పలువురు ఆందోళనకారులు లారీలపైకి రాళ్లు రువ్వారు. ఓ లారీ అద్దాలను ధ్వంసం చేశారు. దాంతో సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఈ ఆందోళనలు బెలగావిలో కర్ణాటక రక్షణ వేదిక అనే సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఆందోళనల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సమన్వయ మంత్రులు చంద్రకాంత్ పాటిల్, శంభురాజ్ దేశాయ్ బెలగావి పర్యటనను రద్దు చేసుకున్నారు.
1960 లో భాషా ఆధారిత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మరాఠీ మెజారిటీ ప్రాంతాన్ని కన్నడ మెజారిటీ కర్ణాటకకు తప్పుగా ఇచ్చారని మహారాష్ట్ర వాదిస్తున్నది. బెలగావి ప్రాదేశికం ఈ వివాదానికి కేంద్రంగా ఉన్నది.
కర్ణాటక ఇటీవల మహారాష్ట్రలోని కొన్ని గ్రామాలపై తన వాదనను మరోసారి బయటకు తీసింది. దాంతో ఇరురాష్ట్రాల మధ్య సరిహద్దు ప్రాంతాల వివాదం పెద్దదిగా మారింది. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ తాజా దుమారం రేగుతుండటం విశేషం.
మంగళవారం జరిగిన నిరసనలో ఆందోళనకారులు సంప్రదాయ కన్నడ జెండాలతో వచ్చారు. నిరసనకారుల ఆందోళనలతో చాలా దూరం వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. అయితే నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగి రోడ్డుపై పడుకున్నారు. మహారాష్ట్ర మంత్రుల పర్యటన సరిహద్దులో శాంతిభద్రతలకు సవాలుగా మారుతుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. ఈ వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉన్నందున సమస్యను పరిష్కరించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం చంద్రకాంత్ పాటిల్, శంభురాయ్ దేశాయ్ను సమన్వయ మంత్రులుగా నియమించింది.