ముంబై : గణేష్ వేడుకల సందర్భంగా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొవిడ్-19 నిబంధనలను విధిగా పాటించాలని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపె హెచ్చరించారు. ప్రజలు పండుగ సందర్భంగా పెద్దసంఖ్యలో గుమికూడితే వైరస్ వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఈ పరిస్ధితి తలెత్తడం చూశామని, కేరళలో ఓనం ఉత్సవాల్లో ప్రజలు ఒక్కచోట చేరడంతో కరోనా రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిందని మంత్రి గుర్తుచేశారు.
మహారాష్ట్రలో పుణేతో పాటు నాలుగైదు జిల్లాల్లో కొవిడ్-19 కేసుల సంఖ్య అధికంగా ఉందని అన్నారు. మరోవైపు కొవిడ్-19 థర్డ్ వేవ్ విస్తరించకపోయినా దేశంలోనే ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ హెచ్చరించారు. ప్రజలు ఇండ్లలోనే పండగ జరుపుకోవాలని సూచించారు.
ఇక రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలకు దూరంగా ఉండాలని, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనే కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. పండుగలు తర్వాత జరుపుకోవవచ్చని ప్రజల ప్రాణాలే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.