Maharashtra | ముంబై: మహారాష్ట్రలోని ప్రభుత్వ దవాఖానల్లో మరణాలు ఆగడం లేదు. నిన్న నాందేడ్.. నేడు ఔరంగాబాద్ దవాఖానలో రోజూ పదుల సంఖ్యలో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలో 48 గంటల వ్యవధిలో రెండు ప్రభుత్వ దవాఖానాల్లో 49 మరణాలు చోటుచేసుకున్నాయి. సరైన వైద్య సేవలు, ఔషధాలు, వైద్య పరికరాలు లేకపోవటం రోగుల వరుస మరణాలు కారణమని ప్రతిపక్షాలు ఏక్నాథ్ షిండే ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఔరంగాబాద్ ఛత్రపతి శంభాజీనగర్లోని ప్రభుత్వ దవాఖానలో 24 గంటల వ్యవధిలో (మంగళవారం ఉదయం 8గంటల నాటికి) 18 మందికిపైగా రోగులు మృత్యువాత పడ్డారు. ఇందులో ఇద్దరు నవజాత శిశువులు ఉన్నారని అధికారులు వెల్లడించారు.
నాందేడ్లో 31 చేరిన మృతుల సంఖ్య
నాందెడ్ జిల్లా దవాఖానలో మరో ఏడుగురు చనిపోగా, మొత్తం మృతుల సంఖ్య 31కి చేరుకుంది. జిల్లా సమాచార అధికారి విడుదల చేసిన వివరాల ప్రకారం, సెప్టెంబర్ 30-అక్టోబర్ 1 మధ్య 24 గంటల్లో 24 మంది పేషెంట్లు మరణించారు. ఇదే దవాఖానలో అక్టోబర్ 1-2 మధ్య మరో ఏడు మరణాలు చోటుచేసుకున్నాయి. దవాఖానలో వరుస మరణాలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పేదల బతుకులకు విలువ లేదా? అని ప్రశ్నించాయి. ‘బీజేపీ నేతృత్వంలోని ట్రిపుల్ ఇంజిన్ సర్కారే ఈ మరణాలకు బాధ్యత వహించాలి’ అని మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ విమర్శించారు.