ముంబై: మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ చివరి దశకు చేరుకున్నది. రేపు ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానున్నది. అసెంబ్లీలో బలనిరూపణ చేయాలని ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేను గవర్నర్ భగవత్ సింగ్ కోశియారి ఆదేశించారు. గురువారం సాయంత్రం 5 గంటల లోపు సీఎం ఉద్దవ్ తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు బలపరీక్షలో నెగ్గాల్సి ఉంటుంది. అయితే ఆ అసెంబ్లీ సమావేశాల్ని రికార్డ్ చేయాలని కూడా గవర్నర్ కోశియారి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. శివసేన పార్టీలో వచ్చిన చీలికలతో మహా వికాశ్ అగాధీ కూటమి ఇబ్బందుల్లో పడింది. షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యేలు కొందరు సీఎం ఉద్దవ్కు వ్యతిరేకంగా తిరుగుబాటుకు దిగారు. దీంతో మహారాష్ట్ర సర్కార్ అగాధంలోకి కూరుకుపోయింది. తనతో 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఏక్నాథ్ షిండే తెలిపారు.
గురువారం ఉదయం 11 గంటలకు సభ సమావేశం అవుతుందని, ఒకే ఎజెండాతో సభ జరుగుతుందని గవర్నర్ కోశియారి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, సుమారు 39 మంది ఎమ్మెల్యేలు మహా వికాశ్ అగాధి ప్రభుత్వాన్ని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని, దీనికి మద్దతు ఇస్తూ ఏడు మంది ఎమ్మెల్యేలు కూడా లేఖలు రాసినట్లు గవర్నర్ తెలిపారు. ప్రతిపక్ష నేత కూడా తనను కలిసి పరిస్థితిని వివరించినట్లు గవర్నర్ చెప్పారు. దానికి అనుగుణంగా బలపరీక్ష జరగాలని గవర్నర్ ఆదేశించారు.