ముంబై: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) చీలిక వర్గం అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) వరుసగా రెండో రోజూ తన బాబాయ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్పవార్ (Sharad Pawar) తో భేటీ అయ్యారు. తనతోపాటు ఎన్సీపీని వీడిన చీలికవర్గం నాయకులు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్బల్, దిలీప్ వాల్సేలతో కలిసి అజిత్పవార్ వైబీ చవాన్ సెంటర్కు చేరుకున్నారు.
అజిత్పవార్ వర్గం నేతలు చేరుకున్న కొంతసేపటికి శరద్పవార్ కూడా వైబీ చవాన్ సెంటర్కు వచ్చేశాడు. అనంతరం అజిత్ వర్గం ఆయనతో భేటీ అయ్యింది. ఈ భేటీలో ఏం జరుగుతున్నదోననేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా, అజిత్ వర్గం ఆదివారం కూడా ఒకసారి శరద్పవార్తో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా పార్టీని ఐక్యంగా ఉంచుదామంటూ అజిత్ వర్గం నేతలు చేసిన ప్రతిపాదనకు శరద్పవార్ ఏమీ చెప్పకుండా మౌనం దాల్చినట్లు తెలిసింది.
ఈ క్రమంలో ఇవాళ మరోసారి అజిత్పవార్ వర్గం శరద్పవార్తో భేటీ కావడం మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, అజిత్ పవార్ ఇటీవల శరద్పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని రెండుగా చీల్చి తన వర్గంతో కలిసి మహారాష్ట్ర సర్కారులో చేరారు. అందుకు ప్రతిఫలంగా మహా సర్కారులో అజిత్పవార్కు ఉప ముఖ్యమంత్రి పదవి, ఆయన వర్గం ఎమ్మెల్యేలు 8 మందికి మంత్రి పదవులు దక్కాయి.