ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలతో సభ్యులతో కలిసి తిరుగుబావుటా ఎగుర వేయడంతో మహారాష్ట్ర మహా వికాస్ అఘాది కూటమిలో ప్రకంపనలు సృష్టించాయి. మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేపీ ఐదు స్థానాల్లో అనూహ్యంగా విజయం సాధించడం ప్రకంపనలు సృష్టించాయి. దీంతో ఎంవీఏ కూటమి ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
మహారాష్ట్రలో ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి స్ట్రిప్ట్ వాస్తవానికి రాజ్యసభ ఎన్నికల సమయంలోనే పడిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో 106 మంది సభ్యులున్న బీజేపీ 123 ఓట్లతో ముగ్గురు ఎంపీలను గెలుచుకున్నది. సోమవారం జరిగిన మండలి ఎన్నికల్లోనూ ఆ పార్టీ 134 ఎమ్మెల్యేల మద్దతుతో ఐదుగురు అభ్యర్థులను గెలుచుకుంది. 162 మంది ఎమ్మెల్యేలున్న కూటమి కేవలం ఐదుగురు మాత్రమే గెలిచారు. 55 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అధికార శివసేనకు 52 ఓట్లు వచ్చాయి.
శాసన మండలిలో 10 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఐదుగురు అభ్యర్థులను బరిలో దింపింది. అయితే, కేవలం నలుగురు అభ్యర్థులను గెలిపించుకునేందుకు మాత్రమే బలం ఉన్నా.. ఐదుగురిని పోటీ చేయించింది. అయితే కూటమికి చెందిన ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్, స్వతంత్ర ఎమ్మెల్యేల ఓటింగ్తో ఐదో అభ్యర్థి గెలుపు మార్గం సుగమమైంది. రాజ్యసభ మాదిరిగానే ప్రాధాన్య ప్రాతిపదికన జరిగిన తొలి రౌండ్ ఎన్నికల్లో బీజేపీకి నలుగురు ఎన్సీపీ, శివసేనకు చెందిన ఇద్దరు చొప్పున అభ్యర్థులు గెలుపొందారు.
రెండో రౌండ్లో బీజేపీ అభ్యర్థి ప్రసాద్లాడ్, కాంగ్రెస్కు చెందిన జగ్తాప్, చంద్రకాంత్ హందోరేల మధ్య గట్టి పోటీ నెలకొన్నది. ఎన్నికల్లో గెలుపొందాలంటే కనీసం 26 ఓట్లు రావాలి.. దీంతో 44 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్కు ఇద్దరిని గెలిపించుకోవడం కష్టంగా మారింది. ఎన్నికల్లో జగ్తాప్కు 26 ఓట్లు, చంద్రకాంత్కు 22 ఓట్లు వచ్చాయి. మరో వైపు బీజేపీ అభ్యర్థి ప్రసాద్లాడ్ 28 ఓట్లు సాధించి విజయాన్ని సాధించాడు. బీజేపీకి మద్దతుగా శివసేన, కాంగ్రెస్ సభ్యులు కాంగ్రెస్ ఓటింగ్ వేయడంతోనే బీజేపీ అభ్యర్థి విజయం సాధించినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మాజీ సీఎం, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ స్వతంత్రుల అభ్యర్థుల మద్దతును సైతం సాధించాడు.
ఈ క్రమంలోనే శివసేన ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే మంగళవారం తిరుగుబావుటా ఎగురవేశారు. ఈ రాజకీయ గందరగోళం మధ్య ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ సైతం మౌనం వహించడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేయడంతో మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అయితే, షిండే మాత్రం బీజేపీతో కలిసి వెళ్తారా? శివసేనలో ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తారా? అన్నది తెలియాల్సి ఉన్నది.