ముంబై : ఏక్నాథ్ షిండే సహా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రస్తుతం అసోంలో గౌహతిలోని ఓ స్టార్ హోటల్లో క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేల తిరుగుబాటుపై శివసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం శివసైనికులు రెబెల్ ఎమ్మెల్యేల ఇండ్లు, కార్యాలయాలను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ‘వై’ కేటగిరి భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. షిండే వర్గంలో ఉన్న 15 మంది ఎమ్మెల్యేలు శనివారం కేంద్ర హోంశాఖ కార్యదర్శితో పాటు మహారాష్ట్ర గవర్నర్కు లేఖ రాశారు.
శివసైనికుల నుంచి వెల్లువెత్తుతున్న నిరసనల నేపథ్యంలో ఎమ్మెల్యేలకు భద్రత కల్పించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఆదివారం సాయంత్రంలోగా 15 మంది ఎమ్మెల్యేల ఇండ్ల వద్ద సీఆర్పీఎస్ సిబ్బందిని మోహరించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శివసేనతో పాటు స్వతంత్ర ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 38 మందితో ఏక్నాథ్ షిండే గౌహతిలో మకాం వేశారు. అయితే, షిండే గ్రూప్లో చేరిన పలువురు ఎమ్మెల్యే ఎంపీ సంజయ్ రౌత్తో టచ్లో ఉన్నట్లు తెలియవచ్చింది. ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నట్లు సంజయ్ రౌత్ సైతం స్వయంగా ప్రకటించారు.