ప్రధానికి మహారాష్ట్ర నేత ఆశిష్ లేఖ
ముంబై, జూలై 15: ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న బీజేపీ మాజీ నేత ఆశిష్ దేశ్ముఖ్ ఆసక్తికర ప్రతిపాదన చేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో దేశాన్ని 75 రాష్ర్టాలుగా విభజించాలని కోరుతూ ప్రధాని మోదీకి తాజాగా లేఖ రాశారు. మహారాష్ట్రలోని విదర్భ రీజియన్ను రాష్ట్రంగా చేయాలని నొక్కిచెప్పారు.
జనాభాపరంగా ప్రపంచంలో రెండో స్థానంలో భారత్.. అనేక అభివృద్ధి సూచీల్లో మాత్రం అట్టడుగున ఉన్నదని అశిష్ దేశ్ముఖ్ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి కోసం చిన్న రాష్ర్టాలు ఉండాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. పరోక్షంగా తెలంగాణను ఉద్దేశిస్తూ మహారాష్ట్రకు పొరుగున కొత్తగా ఏర్పడిన రాష్ర్టాలు వేగంగా పురోగతి సాధిస్తున్నాయని అన్నారు.