ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో వరద పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రత్నగిరి, రాయ్గఢ్ జిల్లాల్లో వరదలు తీవ్ర ప్రభావం చూపడంతో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఆయా జిల్లాల్లో పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విపత్తు నిర్వహణ విభాగాలకు, సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీచేశారు. వరదల నేపథ్యంలో అందరూ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలని సూచించారు.
ఈ వివరాలను మహారాష్ట్ర సీఎం కార్యాలయ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. కాగా, మహారాష్ట్ర రాజధాని ముంబైని గత 24 నుంచి భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. కొన్ని చోట్ల భారీగా నిలిచిన వరదనీరు కారణంగా జనజీవనం స్తంభించిపోయింది.