Milind Deora : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి మిలింద్ దేవరా ఆదివారం మధ్యాహ్నం మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. దేవరాకు షిండే కాషాయ జెండాను అందచేశారు. తాను కాంగ్రెస్ను వీడతానని ఎన్నడూ అనుకోలేదని, ఆ పార్టీతో తమ కుటుంబానికి ఉన్న 55 ఏండ్ల అనుబంధం నేటితో తెగిపోయిందని అంటూ మిలింద్ దేవరా భావోద్వేగానికి లోనయ్యారు. ఏక్నాథ్ షిండే నాయకత్వంలో తాను శివసేన గూటికి చేరుతున్నానని చెప్పారు.
షిండే అందరికీ అందుబాటులో ఉండే నేతని, దేశానికి మోదీ, అమిత్ షా దార్శనికత ఎంతో అవసరమని, అందుకే తాను వారితో కలిసి పనిచేయాలని కోరుకున్నానని అన్నారు. కాగా, మిలింద్ దేవరా తమ పార్టీలో చేరితే స్వాగతిస్తానని అంతకుముందు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని మహారాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేత, దక్షిణ ముంబై మాజీ ఎంపీ మిలింద్ దేవరా ఆదివారం ఉదయం ప్రకటించారు. కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన మధ్య లోక్సభ సీట్ల సర్ధుబాటు చర్చల పట్ల అసంతృప్తితో మిలింద్ దేవరా కాంగ్రెస్ను వీడారని చెబుతున్నారు.
కాగా, ప్రస్తుత రాజకీయాలు అధికారం చుట్టూ తిరుగుతున్నాయని, సిద్ధాంతం, విలువలు, విశ్వాసానికి చోటు లేదని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) వర్గం నేత సంజయ్ రౌత్ అన్నారు. మిలింద్ తండ్రి మురళి దియోర దశాబ్ధాల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించారని, అధికార దాహంతోనే మిలింద్ దియోర శివసేన షిండే వర్గంలో చేరుతున్నారని దుయ్యబట్టారు.
Read More :
Congress | కాంగ్రెస్కు బిగ్ షాక్.. పార్టీకి కేంద్ర మాజీ మంత్రి గుడ్బై