ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని బీజేపీకి ఆ పార్టీ నేత షాక్ ఇచ్చారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో తాను చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయన కుమార్తె కూడా ఇదే సంకేతం ఇచ్చారు. బీజేపీ నేత, మాజీ మంత్రి హర్షవర్ధన్ పాటిల్ (Harshvardhan Patil) శుక్రవారం కీలక ప్రకటన చేశారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరుతానని తెలిపారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన మద్దతుదారులతో సమావేశమైన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం హర్షవర్ధన్ పాటిల్ మీడియాతో మాట్లాడారు. ‘నేను గత రెండు నెలలుగా ఇందాపూర్ నియోజకవర్గం అంతటా పర్యటిస్తూ వివిధ వర్గాల ప్రజలను కలుస్తున్నా. ఒక విషయం స్పష్టంగా ఉంది. నేను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజలు పట్టుబడుతున్నారు’ అని అన్నారు.
కాగా, ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్తో తాను సమావేశమైనట్లు హర్షవర్ధన్ పాటిల్ తెలిపారు. తన మద్దతుదారులతో మాట్లాడిన తర్వాత శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్సీపీ ఎమ్మెల్యే దత్తమామ భర్నేపై పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబరు 7న పూణె జిల్లాలోని ఇందాపూర్లో జరిగే భారీ ర్యాలీలో ఎన్సీపీ (ఎస్పీ)లో ఆయన చేరుతారని మద్దతుదారులు తెలిపారు.
మరోవైపు ఇందాపూర్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హర్షవర్ధన్ పాటిల్, ప్రస్తుతం నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ ఛైర్మన్, కోఆపరేటివ్ బ్యారన్గా ఉన్నారు.
2019 సెప్టెంబరులో కాంగ్రెస్ పార్టీని వీడిన ఆయన బీజేపీలో చేరారు. ఇందాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. అయితే కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షమైన అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఆ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ (ఎస్పీ)లో చేరి ఆ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. పాటిల్ కుమార్తె, పూణె జిల్లా పరిషత్ మాజీ సభ్యురాలు అంకితా పాటిల్ కూడా శరద్ పవార్ వర్గంలో చేరనున్నారు.