ముంబై(నమస్తే తెలంగాణ): విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠా వర్గానికి పది శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును మహారాష్ట్ర శాసనసభ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. సీఎం ఏక్నాథ్ షిండే మరాఠా కోటాపై బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చించిన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రాష్ట్ర జనాభాలో మరాఠాలు 28 శాతం ఉన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందటం వల్ల మరాఠా వర్గానికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్ లభించనున్నాయి.
ఈ రిజర్వేషన్లను ప దేళ్ల తర్వాత సమీక్షిస్తారు. రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని కులాలు, సమూహాలు రిజర్వ్డ్ క్యాటగిరీల్లో ఉన్నాయి. అన్నీ కలిపి 52 శాతం రిజర్వేషన్లను అనుభవిస్తున్నాయి. 52 శాతం రిజర్వేషన్లలో షెడ్యూల్డ్ కులాలు 13 శాతం, షెడ్యూల్డ్ తెగలు 7 శాతం, ఓబీసీలు 19 శాతం, ప్రత్యేక వెనుకబడిన తరగతులు 2 శాతం, విముక్త జాతి 3 శాతం, సంచార తెగ(బీ) 2.5 శాతం, సంచార తెగ(సీ) ధన్గర్ 3.5 శాతం, సంచార తెగ (డీ) వంజరి 2 శాతం రిజర్వేషన్లను కలిగి ఉన్నాయి.