ముంబై: ప్రేమ విఫలమైందన్న బాధతో శనివారం షూటింగ్ సెట్లోనే ఆత్మహత్య చేసుకున్న యువ నటి తునిషా శర్మ అంత్యక్రియలు ఈ నెల 27న జరగనున్నాయి. ఈ నెల 27న మీరా రోడ్ ఏరియాలోని శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తునిషా సమీప బంధువు పవన్ శర్మ చెప్పారు. తునీషా మేనత్త ఇంగ్లండ్ నుంచి వస్తున్నారని, ఆమె రాగానే అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
తునిషా శర్మ మృతికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 1.30 గంటలకు ఆమె మృతదేహాన్ని ముంబైలోని జేజే హాస్పిటల్కు తరలించారు. తెల్లవారుజామున 4.30 గంటలకు ఆమె బాడీకి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కోల్డ్ స్టోరేజీలో ఉంచారు. మరోవైపు ఈ కేసులో దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 11 మంది వాంగ్మూలాలను నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.